హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): గ్రామీణ మహిళలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొండంత అండగా నిలుస్తున్నది. ఉపాధి పనులకు అతివలే ఎక్కువగా హాజరవుతున్నారు. మగవారితో పోలిస్తే అధిక వేతనం తీసుకోవడంలోనూ మహిళలే ముందుంటున్నారు. మూడేండ్లలో 1,35,91,079 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా.. వీరిలో 76,96,676 (56.63%) మంది మహిళలు, 58,94,403 (43.7%) మంది పురుషులు ఉన్నారు. కరోనా కష్టకాలంలో పల్లెల్లోని వ్యవసాయ కూలీలకు, పట్టణాల్లోని రోజువారీ కూలీలకు ‘ఉపాధి’ ఎంతగానో ఉపయోగపడింది. పనులు దొరక్క పొట్టచేతపట్టుకొని స్వగ్రామాలకు వచ్చినవారిని ఆదుకున్నది. రెండేండ్లలో రికార్డుస్థాయిలో లక్షలమంది కూలీలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందడమే ఇందుకు నిదర్శనం. కరోనా కోరలుచాచిన తొలి ఏడాది 2020-21లో 52 లక్షలు మంది, 2021-22లో 42 లక్షల మంది ఉపాధి పనిచేశారు. ఇప్పటికీ రోజూ సగటున లక్షాయాభై వేలమంది కూలీలు పనులు చేస్తుండగా.. ఇందులోనూ మహిళా కూలీలే ఎక్కువమంది ఉన్నారు.