హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గత ఎన్నికలకు ముందు ఆ ఊళ్లో బీజేపీ అంటే ఎవరికీ తెలియదు. మోదీ బూటకపు హామీలను నమ్మిన ఓ సామాన్యుడు కమలం జెండా భుజానేసుకొని ఊరంతా తిరిగి పార్టీని పరిచయం చేసిండు. పార్టీ ఎదుగుదల కోసం తనవంతుగా అహర్నిషలు పనిచేసిండు. మూడేండ్ల క్రితం అనారోగ్యంతో ఆ కార్యకర్త చనిపోతే.. పలుకరించడానికి ఒక్క నాయకుడూ రాలే. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కమలం జెండా అక్కరకు రాలే. కొన్నాళ్లకే అతని కొడుకూ చనిపోయాడు. తన పార్టీ కార్యకర్త భార్యను, కుటుంబాన్ని బీజేపీ ఆదుకోలేదు.. పార్టీ నాయకులెవరూ పట్టించుకోలేదు. కనీసం ఆ ఇంటివైపు చూడనైనా లేదు. చివరకు ఆ కుటుంబాన్ని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకొన్నది.
ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాయి. ఇన్నేండ్ల తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ యాత్ర ఆ ఊరిమీదుగా వెళ్లింది. ఆ ఊరు.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి. ఆ ఊరుకు వెళ్లిన సంజయ్ అక్కడ ప్రజలతో పోచికోలు ముచ్చట్లు మొదలుపెట్టారు. అక్కడే ఉన్న దివంగత పార్టీ కార్యకర్త భార్య.. సంజయ్ వద్దకు వెళ్లి.. బీజేపీలో తన కుటుంబానికి ఎదురైన దుస్థితిపై నిలదీసింది. ‘ఇంతకుముందు మా ఊరిలో బీజేపీ అంటే ఎవరికీ తెల్వదు. మా ఆయనే ఏర్పరిచిండు. ఆయన చనిపోయి మూడేండ్లు అవుతుంది. కొడుకు కూడా పోయిండు. ఇప్పుడు నేనొక్కదాన్నే ఉన్న. ఇప్పటికీ మా ఇంటినిండా బీజేపీ గుర్తులే ఉన్నయి. పాండురంగారెడ్డి, బుచ్చిరెడ్డి వెంట మా ఆయన పార్టీ కోసం తిరిగిండు. కానీ, చనిపోయిన్నాడు, ఆ తర్వాత ఏ ఒక్కరూ వచ్చి చూడలేదు. కనీసం ఓదార్చలేదు. నాకిది కావాలని నేనెవర్నీ ఏం అడగలే. కానీ నాకు కేసీఆర్ రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇచ్చిండు. ఫించన్ వస్తలేదు కానీ కొంచెం టైం పడుతది అన్నరు’ అని ఆమె చెప్పింది.
తెల్లమొకమేసిన బండి
ఆమె మాట్లాడుతుంటే ఏం అనాలో బండిసంజయ్కు తోచలేదు. కొంచెంసేపు తెల్లమొకమేసుకొని విన్నరు. తర్వాత తేరుకొని.. ‘నువ్వు ఎక్కడ ఉండేది? నేను మీ ఇంటికి వస్తా’ అని ఆమెకు సర్దిచెప్పడానికి కనాకష్టం పడ్డరు. ఈ ఘటనకు చెందిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి ట్విట్టర్లో పోస్టుచేశారు. దీనిపై ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు.
బడుగువర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కేటీఆర్
‘రాజకీయాలకు అతీతంగా బలహీనవర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బీజేపీ కోసం పనిచేసే ఓ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షలు వచ్చాయని ఆ నాయకుడి భార్య స్వయంగా చెప్పింది. (రైతులకు మద్దతుగా నిలిచేందుకు 40 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించి రైతుబీమా అందిస్తున్నది)’ అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన నెటిజన్లు.. ‘పాదయాత్రలు చేస్తేనే మీరు ప్రజల దగ్గరకు వెళ్తారు కావచ్చు కానీ, సంక్షేమ పథకాలతో కేసీఆర్ ఎప్పుడో ప్రజల గుండెల్లో చేరిపోయారు’.. ‘బండిసంజయ్ యాత్ర మొదటి విడతలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను చూశారు.. ప్రజలకు చూపించారు. ఇప్పుడు కార్యకర్తలకు కష్టం వస్తే బీజేపీ పట్టించుకోదనే విషయాన్ని స్వయంగా తెలియజేస్తున్నారు’, అని ట్వీట్లు చేశారు.