హైదరాబాద్ / కవాడిగూడ, నవంబర్ 20 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు. అర్వింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద మంత్రి శ్రీదేవితోపాటు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు ముక్తవరం సుశీలారెడ్డి, జాగృతి నేతలు, టీఆర్ఎస్ మహిళా సంఘాల నేతలు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే విధంగా ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సాటి మహిళగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అదే అర్వింద్ ఇంటిపై దాడి జరిగితే ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. సుశీలారెడ్డి మాట్లాడుతూ అర్వింద్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకొంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాగృతి, మహిళా సంఘాల నాయకురాలు మంచాల వరలక్ష్మి, లీల, కీర్తిగౌడ్, ప్రీతిరెడ్డి, ఉషారాణి, రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.