హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల్లోనూ పోటీ విపరీతంగా పెరుగుతున్నది. ఒక్కో ఉద్యోగానికి వందల సంఖ్యలో నారీమణులు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో ఉద్యోగాలకు మహిళలు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మహిళా అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్ల శాఖ, రవాణాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల రెండు నుంచి శుక్రవారం వరకు మొత్తం 4.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 23 శాతం అంటే లక్షకుపైగా దరఖాస్తులు మహిళలవేనని పేర్కొన్నారు. మిగిలిన 77 శాతం పురుషులు దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు. సామాజిక వర్గాలవారీగా చూస్తే.. 53 శాతం దరఖాస్తులు బీసీ అభ్యర్థుల నుంచి, 22 శాతం ఎస్సీల నుంచి, 19 శాతం ఎస్టీల నుంచి, 6 శాతం ఓసీల నుంచి వచ్చినట్టు వివరించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొన్నవారిలో ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం తెలుగులో కావాలని 2/3 శాతం మంది, ఇంగ్లిష్లో కావాలని 1/3 శాతం మంది అభ్యర్థులు కోరినట్టు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటలతో దరఖాస్తు గడువు ముగుస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో గడువు పెంచబోమని ఆయన స్పష్టంచేశారు. వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియ ముగించుకొంటే మంచిదని సూచించారు.