హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయా మహిళా నేతలు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రశంసించారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ సింహభాగం మహిళలకే కేటాయిస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
బీఆర్ఎస్లో చేరిన ప్రముఖ మహిళలు
బీఆర్ఎస్లో చేరిన వారిలో కారంజా కార్పోరేటర్ మాలతాయి సరోదే, మంగళాతాయి అడ్వికర్, బీజేపీ మహిళా అఘాడి చీఫ్ సరికాతాయి ఠాకరే, శివసేన మహిళా ఆఘాడి చీఫ్ వనితా తాయిఢోక్, ఆశి తాలుకా అధ్యక్షురాలు ఆశాతాయి రావుత్, బీఎస్పీ సభ్యురాలు శిలాతాయి మెహరే, బెలోరా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ చాండదతాయి జాకే, కాంగ్రెస్ నాయకురాలు లీలతాయి మన్హోర్, వాంఖడే గ్రామపంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ చాందతాయి, బీజేపీ సభ్యులు తలతాయి కోరలే, గ్రామపంచాయతీ సభ్యులు మోనికా దిగ్రేస్, బచత్గట్ అధ్యక్షురాలు ప్రగతి తాయడే, పార్డీ గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రేమతాయి శిరకార్, గ్రామపంచాయతీ శివసేన పార్టీ ఉపసర్పంచ్ అంజుతాయి తిరడ్కర్, భీషణ్పూర్ సర్పంచ్ జ్యోతితాయి ధూదాత్, ఆష్టి డీఆర్ఏపీ ప్రెసిడెంట్ జయశ్రీ ఫండే, బీజేపీ సభ్యులు హర్షతాయి పాటిల్, సీఆర్పీ గట్ 150 మహిళా అధ్యక్షురాలు సరళ ఫాట్కర్, వడాళ్ల గ్రామపంచాయతీ శివసేన పార్టీ సర్పంచ్ సీమాతాయి, మహిళా ఆఘాడీ అధ్యక్షురాలు ఆశాబాయి కాంగలే, మహిళా అఘాడీ సభ్యురాలు వర్షాతాయి మడావీ, కార్జా నగర పంచాయతీ కార్పోరేటర్ మాలాతాయి సరోదే తదితరులు ఉన్నారు. పార్టీలో చేరినవారితో సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్లో నిర్వహించనున్న శిక్షణా తరగతులు, భవిష్యత్ వ్యూహాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం తదితరులు పాల్గొన్నారు.