KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు రాఖీలతో సందడి చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్కు తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్కు చేతినిండా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం భారీ క్రేన్తో గజమాల వేసి సన్మానించారు.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అలుగునూరులో కేటీఆర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘కేటీఆర్ జిందాబాద్’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ గజమాలతో కేటీఆర్ను సన్మానించారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ కరీంనగర్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కేటీఆర్ వెళ్తుండగా ఈ స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేటీఆర్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కరీంనగర్కు బయలుదేరారు.
అలుగునూరు చౌరస్తా నుంచి కేటీఆర్ తన కారులో కాన్వాయ్తో కరీంనగర్కు బయలుదేరే సమయంలో వాహనానికి స్వల్ప డ్యామేజ్ జరిగింది. వెనుక డోర్ తెరిచే క్రమంలో పక్క నుంచి వెళ్తున్న లారీ తగలడంతో కారు డోర్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఆ సమయంలో కేటీఆర్కు మహిళలు రాఖీలు కడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం కేటీఆర్ తన పర్యటనను కొనసాగిస్తూ కరీంనగర్కు వెళ్లారు.

Ktr Vehicle