నిజామాబాద్ : పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ సంఘటన కోటగిరి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన నిశిత అనే గర్భిణి పురుటినొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్లో బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖనకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో పురుటినొప్పులు అధికమయ్యాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి ఆమెకు 108 టెక్నీషియన్ లక్ష్మణ్, కుటుంబీకుల సాయంతో కాన్పు జరిపించారు. తల్లీ, బిడ్డను కాపాడారు. కాగా, 108 సిబ్బందికి నిశిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.