శాయంపేట, డిసెంబర్ 19 : తాము కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా అమ్మిన వ్యక్తి వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొన్నది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకకు చెందిన అబ్బు అశోక్రెడ్డి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు వరుణ్రెడ్డి, సుశాంత్రెడ్డి ఉన్నారు. అశోక్రెడ్డి తన అన్న అబ్బు భగవాన్రెడ్డి వద్ద 2013లో ఎకరం భూమి కొన్నాడు. అయితే ఆ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తరువాత ఎన్నిసార్లు అడిగినా భగవాన్రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా సతాయించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సైతం భగవాన్రెడ్డి వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలని మరోసారి అడిగాడు. అందుకు నిరాకరిస్తూ భగవాన్రెడ్డి దు రుసుగా ప్రవర్తించాడు. అశోక్రెడ్డి తన భార్య అనితకు ఈ విషయం చెప్పి బాధపడ్డాడు. పెద్ద మనుషులతో అడిగించినా భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో దంపతులిద్దరూ మనస్తాపానికి గురయ్యారు. క్షణికావేశంలో అనిత పురుగుల మందు తాగింది. అశోక్రెడ్డి కూడా పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా కొడుకులు అడ్డుకొన్నారు. వెంటనే అనితను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. అశోక్రెడ్డి ఫిర్యాదు మేరకు భగవాన్రెడ్డి, అతడి భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేశ్కుమార్ తెలిపారు.