ములుగు, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రాహత్కర్ పేర్కొన్నారు. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు.
సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించనున్నారు. అదనంగా ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించే ఒక న్యాయవాది ఈ కమిటీకి సహకరించనున్నారు. విచారణ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఘటన, గురిం చి, అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సమీక్షించడం, విచారించి, వాస్తవాలను నిర్ధారించేందుకు కమిటీ ప్రయత్నించనున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలను సూచించడం వంటి బాధ్యతలను కూడా కమిటీకి అప్పగించారు. కమిటీ తన సిఫారసులను తదుపరి చర్యల కోసం జాతీయ మహిళా కమిషన్కు సమర్పిస్తుంది.