సూర్యాపేట : నారీ లోకం నడుం బిగిస్తే జరగని పని అంటూ ఉండదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 22 వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం కచ్చితంగా వర్తమానానికి స్ఫూర్తి దాయకంగా నిలబడుతుందని మంత్రి గుంటకండ్ల పేర్కొన్నారు.
పది మంది సభ్యులతో ప్రారంభమై పదివేల మందికి చేరడమే కాకుండా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుని 22 వ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం ముమ్మాటికీ సంఘం క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆర్థిక సమతా మండలి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22 వ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహిళలు తలుచుకుంటే కానిది ఏదీ లేదన్నారు. అందుకు కరీంనగర్ జిల్లా ముల్కనూర్ పాల సొసైటీ ముందు వరుసలో ఉండగా అదే వరసలో సూర్యాపేట కు చెందిన అంత్యోదయ సొసైటీ నిలిచిందని మంత్రి కొనియాడారు. అందుకు మహిళలు సంఘటితమై ఏర్పరచుకున్న సొసైటీలో క్రమశిక్షణ, నిబద్ధత లను పాటించడమే కారణం అని ఆయన చెప్పారు.
ఎన్నో ప్రభుత్వ సంస్థలను నష్టాల పాలుజేసి రాత్రికి రాత్రే మూసి వేస్తున్న తరుణంలో మహిళలు ఏర్పరచుకున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం ఏకంగా 22 వ సంవత్సరం లోకి అడుగిడడం అభినందనీయమన్నారు. అటువంటి సంస్థ పురోగతి లో ప్రభుత్వం గా భాగస్వామ్యం చేస్తే త్తప్పకుండా తోడ్పాటు నందిస్తానని మంత్రి జగదీష్ రెడ్డి సంఘానికి హామీ నిచ్చారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.