హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలికపై దాడులు జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ స్పందించి బాధితులకు భద్రత, భరోసా కల్పించేలా సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. చెప్పారు. నిందితులకు వెంటనే శిక్ష పడేట్టు చూడటం, షీ టీమ్స్ను రాష్ట్రమంతా విస్తరింప చేసి పకడ్బందీగా అమలు చేయడం వంటి చర్యలతో బాలికలు, మహిళలపై హింసను అరికట్టవచ్చని తెలిపారు. విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులను నిలువరించేందుకు ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్త్రీ స్థాయిని దిగజార్చే అంశాలు, వ్యాఖ్యానాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.