పిల్లలు పుట్టినా ఎస్సై కావాలనే తపన
ఇద్దరు చిన్నారులతో తరగతులకు జగదేవి
పిల్లల కోసం తోడుగా అత్త కూడా
సంగారెడ్డి అర్బన్, మే 4: పెండ్లి అయి పిల్లలు పుట్టాక స్త్రీకి భర్త, పిల్లలే సర్వస్వం. పిల్లల ఎదుగుదలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో ఎన్నో కలలను చంపుకొంటారు. గొప్పగా ఎదిగే అవకాశాలను సైతం వదులుకొంటారు. కానీ, వివాహమై ఇద్దరు పిల్లలున్నా తన లక్ష్యం కోసం మైదానంలోకి అడుగుపెట్టింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామానికి చెందిన బేగరి జగదేవి. పోలీస్ కావాలనే కలను నిజం చేసుకోవాలనే తపనతో తన ఇద్దరు పిల్లలతో శిక్షణ తరగతులకు హాజరవుతున్నది.
రోజూ 15 కిలోమీటర్ల దూరం నుంచి సం గారెడ్డిలోని అంబేద్కర్భవన్లో నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ శిక్షణ తరగతులకు కన్న బిడ్డలతో సహా హాజరవుతున్నది. భర్త సుఖేందర్ చిన్న ప్రైవేటు ఉద్యోగి. వీరికి నాలుగేండ్ల కుమారుడు, ఐదు నెలల కూతురు ఉన్నది. పిల్లల ఆలనాపాలనా చూసుకొనేందుకు జగదేవి అత్తమ్మ మణెమ్మ కూడా ప్రతిరోజు శిక్షణ శిబిరానికి వస్తున్నది. ఎస్సై ఉద్యోగం సాధించి తన కల నెరవేర్చుకోవాలన్న జగదేవి సంకల్పానికి సలాం కొట్టాల్సిందే.