హైదరాబాద్ : భర్త వేధింపులు, అత్తమామల ఆగడాలు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను చెరువులో పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కొత్తపల్లికి చెందిన రాజుకు వట్కూరి రేఖతో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు అభిజ్ఞ(3), హన్సిక(6 నెలలు) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఇద్దరు కూతుళ్లు కావడంతో అదనపు కట్నం కోసం రాజు రేఖను వేధిస్తున్నాడు. అత్తమామల ఆగడాలు కూడా అధికమయ్యాయి. దీంతో అత్తింటి వారి వేధింపులు భరించలేక పోయింది.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నుంచి తన ఇద్దరు పిల్లలను తీసుకొని సమీప చెరువు వద్దకు వెళ్లింది. ఇద్దరు అమ్మాయిలను చెరువులో పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురి మృతదేహాలు చెరువులో తేలియాడాయి. డెడ్బాడీలను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే రేఖ, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన రాజుకు కూడా ఇలాంటి శిక్షనే విధించాలని ఆమె తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.