నాంపల్లి, జనవరి 31 : వివాహేతర సంబంధం ఓతల్లీబిడ్డను బలిగొన్న దారుణ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కేతేపల్లికి చెందిన కుందేల లక్ష్మమ్మ -కృష్ణయ్య కుమారుడు నగేశ్కు మర్రిగూడెం మండలం సరంపేటకు చెందిన మమతతో ఆరేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మీసాల సుజాతతో నగేశ్కు వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న మమతను తొలగించడానికి సుజాత పథకం వేసింది. ఇందులోభాగంగా సుజాత శనివారం ఒక సంచిలో కత్తి, పొడికారం, డబ్బాలో పెట్రోలు తీసుకుని నగేశ్ ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్న కొడుకు (6 నెలలు)కు పాలు ఇస్తున్న మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
మంటలకు తాళలేక మమత కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే మమత మృతి చెందగా.. చిన్నబాబును హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాలను దేవరకొండ ఏరియా దవాఖానకు తరలించారు. మమత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు నాంపల్లి సీఐ దూది రాజు పేర్కొన్నారు.
తల్లీకొడుకును చంపి.. ఆత్మహత్య;సిద్దిపేట జిల్లా వడ్లూర్లో ఘటన
బెజ్జంకి, జనవరి 31: తల్లి, కొడుకును ఇంట్లో కిరాతంగా హత్యచేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూర్లో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వడ్లూర్ గ్రామానికి చెందిన జక్కని సత్యనారాయణ (65)-దేవేంద్రమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. సత్యనారాయణ గ్రామంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. పెద్ద కుమారుడు నరేశ్ కరీంనగర్, చిన్న కుమారుడు రాజు సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నారు. మరో కొడుకు సురేశ్ గతంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.
శనివారం ఉదయం దేవేంద్రమ్మ పన్ను నొప్పి రాగా, కరీంనగర్ దవాఖానకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి అత్త యశోద (85), కుమారుడు సురేశ్ (35) రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. ఆందోళనకు గురైన ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా సత్యనారాయణ ఉరేసుకుని కనిపించాడు. ముగ్గురి మృతదేహాలను చూసి దేవేంద్రమ్మ భోరున విలపించింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై సౌజన్య ఘటనా స్థలానికి చేరుకుని డాగ్స్కాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.