హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): . ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (26), రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబోర ప్రేమించుకున్నారు.
నాలుగేండ్ల పాటు కొనసాగిన వీరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబంలో తెలిసింది. ఏడాది క్రితమే గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన మరో యువతితో అతనికి వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని ప్రియురాలి వద్ద నాగశేషు దాచి ఉంచాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో పలుసార్లు నాగశేషుతో డెబోర గొడవపడింది. మోసం చేసిన ప్రియుడిపై ఆమె కసి పెంచుకున్నది.
స్నేహితుడైన రాజవొమ్మంగి మండలం దూసరపాడుకు చెందిన విశ్వనారాయణతో కలిసి డెబోర బుధవారం అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న ప్రియుడిని నిద్రలేపి గొడవకు దిగింది. తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో అతడిపై దాడి చేసింది. నాగశేషు కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు పడుగులో పడి ఉన్న అతడిని అంబులెన్స్లో రంపచోడవరం ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితురాలిని, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.