శవాన్ని వాగులో పాతిపెట్టిన మహిళ
గన్నేరువరం, మే 30: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక్ష్మితో 17 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు కేటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో భర్తతో కలిసి పనిచేసే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లికి చెందిన బోనగిరి వెంకటస్వామితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిపై అనుమానం పెంచుకొన్న వెంకటేశ్వర్లు లక్ష్మిని నిలదీశాడు. ఈ విషయంపై నిత్యం తాగి వచ్చి గొడవ పడేవాడు. తన భార్యతో చనువుగా ఉండకూడదని వెంకటస్వామిని హెచ్చరించాడు. ఈ విషయం తెలిసిన లక్ష్మి భర్తను మరింత నిర్లక్ష్యం చేయడంతోపాటు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నది. పథకం ప్రకారం ఈ నెల 27న మద్యం తాగి వచ్చిన వెంకటేశ్వర్లు భార్యతో గొడవపడుతుండగా.. లక్ష్మి రోకలి బండతో తలపై కొట్టింది. అతడు కింద పడిపోగానే కత్తితో మెడ పై నరికి హత్యచేసింది.
ఈ విషయాన్ని వెంటనే ప్రియుడు వెంకటస్వామికి తెలిపి శవాన్ని మాయం చేయాలని కోరింది. అతను తన మిత్రుడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామకు చెందిన కుమార్ సాయం చేయాలని కోరాడు. దీనికి కుమార్ నిరాకరించడంతో అతన్ని చంపుతామని బెదిరించాడు. భయాందోళనకు గురైన కుమార్ అంగీకరించినట్టు నటించి, మరుసటి రోజు గన్నేరువరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిమ్మాపూర్ ఇంచార్చి సీఐ కృష్ణారెడ్డి కేసును దర్యాప్తుచేసి నిందితులను అరెస్టు చేశారు. పొట్లపెల్లి శివారులోని వాగులో పాతిపెట్టిన శవాన్ని హుస్నాబాద్ తాసిల్దార్ సమక్షంలో బయటకు తీసి పంచనామా నిర్వహించారు.