సంగారెడ్డి : కూతురికి రెండో పెళ్లి చేసేందుకు ఏడాదిన్నర వయసున్న బాబును ఓ మహిళ చంపేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకోగా ఇవాళ వెలుగు చూసింది. రాజంపేట ఏరియాకు చెందిన సుజాత అనే మహిళకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. బాబు జన్మించే కంటే కొన్ని నెలల ముందు సుజాత భర్త మరణించాడు. ఆ తర్వాత జనార్ధన్ అనే మరో వ్యక్తితో సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అయితే ఆ పిల్లాడు లేకపోతే తాను సుజాతను పెళ్లి చేసుకునే వాడిని అని ఆమె తల్లి నాగమణికి జనార్ధన్ చెప్పాడు. దీంతో ఆ బాబును ఎలాగైనా వదిలించుకోవాలని నాగమణి కుట్ర చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బాబును తీసుకుని సమీప బావి వద్దకు వెళ్లి దాంట్లో పడేసింది.
తన కుమారుడు కనిపించడం లేదంటూ శుక్రవారం రోజే సంగారెడ్డి పోలీసులకు సుజాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజంపేట ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాబును నాగమణి తీసుకెళ్లిన దృశ్యాలు లభ్యమయ్యాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. నాగమణితో పాటు జనార్ధన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.