Free Bus For Women | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)/ధర్మారం: ‘నేను పొద్దుగాల నుంచి బస్ స్టేజీ దగ్గర నిలబడి ఉన్న.. బస్సులు పోతున్నయ్.. చెయ్యి అడ్డంపెట్టినా ఆపడంలేదు.. ఇదేం పద్ధతి.. ఉచిత ప్రయాణమని బస్సు ఆపకుండా మహిళలను అవమానిస్తే ఎట్లా..? అవసరమైతే టికెట్ కొట్టండి’ అంటూ ఓ మహిళ ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడ్డది. కంట్రోలర్ ఆఫీసుకు చేరుకొని ఆర్టీసీ అధికారుల తీరుపై విరుచుకుపడ్దది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రజిత మందమర్రికి వెళ్లడానికి ఉదయం 7 గంటలకు గ్రామంలోని స్టేజీ వద్దకు వచ్చి నిలబడింది. బస్సు రావడంతో చెయ్యి అడ్డంపెట్టి ఆపమన్నది. కానీ, డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. వేరే బస్సు వచ్చే వరకు ఎదురుచూసి.. అది పట్టుకుని ధర్మారం చేరుకొని.. అధికారులకు కైంప్లెంట్ చేసేందుకు వచ్చింది. అకడ అధికారి లేకపోవటంతో నిరసన తెలిపింది. ‘నేను మంచిర్యాలలోని మందమర్రికి పోవాలె.
ఉదయం 7 గంటలకే మా ఊరి స్టేజీకి వచ్చి నిలబడి ఆపిన. కానీ, డ్రైవర్ ఆపకుండా దంచుకుని ధర్మారం వచ్చిండు. నేను పైసల్ లేక రాలేదు. ఇగో నా చేతిలో రూ.500 నోటు ఉన్నది. అవసరం అనుకుంటే టికెట్ తీసుకోండి. నా ఆధార్ కార్డుతో ఏమి పని? ఉచితమని చెప్పి మహిళనని చూసి బస్సు ఎందుకు ఆపరు? ఆపతికి పోతుంటే ఇట్ల చేస్తే ఎట్లా. ఫ్రీ బస్సు పథకం అని పెట్టి.. ఎందుకు ఇంత మోసం చేస్తున్నరు? అంటూ నిలదీసింది. రజిత నిరసనకు బస్టాండ్లో ఉన్న మరికొందరు మహిళలు కూడా ఆమెతో గొంతు కలిపారు. ‘అందరు డ్రైవర్లు అలాగే చేస్తున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు బస్సు ఆపకుండా పోతున్నారు’ అంటూ ఓ మహిళ చెప్పుకొచ్చింది. ‘ఈ రోజు ఎగ్జామ్ ఉంది. ఒక బస్సు కూడా ఆపలేదు. టైం అయిపోతుందని బండి పట్టుకుని వచ్చాను’ అంటూ మరో మహిళ తన కష్టాన్ని వివరించింది. ఈ మహిళల గోడును వీడియో తీసిన ఓ యువకుడు.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్గా మారింది.