Medak | వెల్దుర్తి, మార్చి 11: ఓ గర్భిణి పురిటినొప్పులతో సర్కారు దవాఖానకు రాగా.. అక్కడ తాళం వేసి ఉంది. నొప్పులు ఎక్కువై వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వెల్దుర్తి కోటకింద ఎస్సీ కాలనీకి చెందిన సృజనకు పురిటి నొప్పులు రావడంతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెల్దుర్తిలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిం ది.
అక్కడికొచ్చి చూసేసరికి దవాఖానకు తాళం వేసి ఉండటంతో ఏఎన్ఎం పద్మకు సృజన కుటుంబీకులు ఫోన్ చేశారు. తమ వెంట నర్సమ్మను కూడా తీసుకొచ్చామని ఏఎన్ఎంకు వివరించారు. ఈ విషయాన్ని ఏఎన్ఎం పద్మ.. రాత్రి విధుల్లో ఉన్న ఏఎన్ఎం జయంతికి ఫోన్ చేసి చెప్పింది. ఏఎన్ఎం జయంతి దవాఖానకు వచ్చే లోపు పురిటినొప్పులు ఎక్కువై సృజనకు సాధారణ ప్రసవం అయ్యింది.
దవాఖాన సిబ్బందిని వివరణ కోరగా.. విధుల్లో ఉండాల్సిన అటెండర్ కుమార్ రాకపోవడం, తోడుగా మహిళలు ఎవరూ లేకపోవడంతో ఏఎన్ఎం జయంతి ఒక్కరే దవాఖానలో ఉండలేక, మరో ఏఎన్ఎం ఇంటికెళ్లి నిద్రించినట్టు చెప్పారు. ఫోన్ రాగానే దవాఖానకు వెళ్లి తాళం తీసి లోపలికి తీసుకెళ్తుండగా నార్మల్ డెలివరీ అయ్యిందని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని జయంతి తెలిపారు. సోమవారం ఉద యం ఆరోగ్య పరీక్షల కోసం తలల్లీ బిడ్డలను మెదక్కు తీసుకెళ్లారు.