కరీంనగర్ రూరల్, మే 27 : ‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తికి చెందిన మహిళా రైతు గోలి రాధ ఆవేదన వెలిబుచ్చింది. గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చేగుర్తి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. చేగుర్తిలో ధాన్యం పరిశీలిస్తున్న సమయంలో మహిళా రైతు ఎమ్మెల్యే కాళ్లపై పడే ప్రయత్నం చేసింది. ‘అయ్యా మీరు.. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బా గుండే. ఇప్పుడు మేం అరిగోస పడుతున్నం. అప్పుడు రైతు బంధు వచ్చేది.
యూరియా దొరికేది. సెంటర్కు ధాన్యం తెస్తే నాలుగు రోజుల్లో కొన్నరు. ఇప్పుడు నాకున్న రెండు ఎకరాలు వరి సాగు చేసేందుకు అప్పులు చేసి, పంట సాగు చేసిన. సెంటర్కు ధాన్యం తెచ్చి న్లైంది. ఈ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొంటలేదు. నిన్న అకాల వర్షం వచ్చి వడ్లు మొత్తం తడిసిపోయినయి. ఈ ధాన్యం గింజల మీద వచ్చే ఆదాయమే నాకు దిక్కు. చేసిన అప్పులు కట్టడానికి ఇంకో దారి లేదు. తడిసిన ధాన్యం తీసుకోమంటున్నరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె గంగుల ఎదుట కంటతడి పె ట్టింది. రాధ పరిస్థితిని విని గంగుల కమలాకర్ చలించిపోయారు. ‘నేను నీ ధ్యానం కొనే వరకు ఇక్కడే ఉంట’ అని భరోసా ఇచ్చారు. వెంటనే నిర్వాహకులతో మాట్లాడి, హమాలీలను పిలిపించి బస్తాకు 42 కిలోల కంటే ఎక్కువ పెట్టకుండా తూకం వేయించారు. దీంతో రాధ గంగులకు కృతజ్ఞతలు తెలిపింది.