బోనకల్లు, సెప్టెంబర్ 20: కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటిపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన వెంగళ మరియమ్మ (48) దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా భయపడ్డ మరియమ్మ.. కోతి నుంచి తప్పించుకునేందుకు కిందకు పరిగెత్తబోయింది. ఈ క్రమంలో డాబాపై నుంచి కిందపడిపోయింది. నడుము, తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. 15 రోజుల పాటు చికిత్స పొందుతున్న ఆమె సోమవారం రాత్రి మృతిచెందింది.