సిద్ధిపేట: క్షణికావేశం..! క్షణికావేశం కళకళలాడుతున్న ఓ కుటుంబంలో కలకలం రేపింది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులతో ఎప్పుడూ ఆనందోత్సాహాలతో ఉండే ఓ ఇంటిని అంద విహీనం చేసింది. ఒడి బియ్యం విషయంలో భర్తతో గొడవపడి క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మరణంతో మనస్థాపానికి గురై పెద్ద కొడుకు ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట్లో సందడి స్థానంలో విషాదం నిండింది. తండ్రి, చిన్న కొడుకు ఇద్దరూ వారికి దూరమైన ఇద్దరి జ్ఞాపకాలతో ఒంటిరిగా మిగిలారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట పట్టణానికి సమీపంలోని చిన్న కోడూరు గ్రామానికి చెందిన నిమ్మల రాజు, సునీత (40) ఇద్దరూ భార్యాభర్తలు. వారికి విఘ్నేశ్ (21), వివేక్ అని ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు విఘ్నేష్ ఎంబీఏ చేస్తుండగా, చిన్న కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కౌలు రౌతు అయిన రాజు భార్యతో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
చిన్నకోడూరు గ్రామస్తులు, సిద్దపేట సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 5న ఒడిబియ్యం విషయంలో సునీత తన భర్త రాజుకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అదేరోజు క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. దాంతో ఆమెను వెంటనే సిద్ధిపేటలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ డిసెంబర్ 8న మరణించింది.
తల్లి మరణాన్ని పెద్ద కొడుకు విఘ్నేశ్ తట్టుకోలేకపోయాడు. మరణవార్త విన్నప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయాడు. అందుకే అంత్యక్రియలు ముగియగానే ఇంట్లో వాళ్లకు తెలియకుండా సిద్దిపేటలోని నర్సాపూర్ చౌరస్తా సమీపంలోగల ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తండ్రికి, బంధువులకు వీడియోకాల్ మాట్లాడాడు.
అమ్మ చనిపోవడం తనకు చాలా బాధగా ఉందని, నాన్న ఆర్థిక ఇబ్బందులు చూడలేకపోతున్నానని చెప్పాడు. అందుకే తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తెలిపాడు. ఇంతలో తండ్రి, బంధువులు వారిస్తున్నా వినకుండా వారంతా చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. దాంతో రాజు, అతని బంధువులు షాకై వెంటనే చిన్నకోడూరు ఎస్ఐ శివానందంకు ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ శివానందం వెంటనే విఘ్నేశ్ ఉన్న లొకేషన్ గుర్తించి సిద్దిపేట టూ టౌన్ పోలీసులను అప్రమత్తం చేయగా.. పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడివున్న విఘ్నేశ్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి సిద్దిపేటలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 9న (సోమవారం) విఘ్నేశ్ చనిపోయాడు.
అయితే, చనిపోయే ముందు తన ఇన్స్టాగ్రాం స్టేటస్, ఇతర సోషల్ మీడియా పోర్టల్లలో విఘ్నేశ్ పెట్టిన సందేశం.. చదివిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నది. తల్లితో కలిసి దిగిన ఫొటోకు ఆ సందేశాన్ని జతచేశాడు. అందులో ఏముందంటే.. ‘స్వర్గంలో ఉన్న అమ్మా.. నేను నీ వద్దకు రావాలని కోరుకుంటున్నా. నిన్ను చేరేందుకు సిద్ధంగా ఉన్నా. రెండు చేతులు చాచి నన్ను నీ ఒడిలోకి తీసుకో..’ అని రాసి ఉంది.
చిన్న గొడవకు తల్లి క్షణికావేశానికి లోను కాకపోయి ఉంటే ఆత్మహత్య ఆలోచన వచ్చేది కాదేమో. తల్లి బతికివుంటే విఘ్నేశ్ కుంగిపోయేవాడు కాదేమో. ఇంత దారుణమైన నిర్ణయం తీసుకునేవాడు కాదేమో. ఏం చేస్తాం అంతా విధి రాత అని సరిపెట్టుకోవడం తప్ప.