మెదక్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమ సర్కార్ ఉన్నదని, ఇక్కడ అమలవుతున్న పథకాలను జీర్ణించుకోలేకనే రాష్ర్టానికి రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకొంటున్నదని ఆరోపించారు. గురువారం మెదక్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో అన్నదాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. భూమికి బరువయ్యేంత పంట తెలంగాణలో పండుతున్నదన్నారు.
దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించి సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లు తున్నదని పేర్కొన్నారు. బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తున్నదని దుయ్యబట్టారు. వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయకుండా 20 శాతం సెస్ వేసిందని మండిపడ్డారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు రావాల్సిన రూ.30 వేల కోట్లను నిలిపి వేసిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయినా సీఎం రాష్ట్రంలో పంట చివరి గింజదాకా కొన్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో వెయ్యిమంది రెగ్యులర్ డాక్టర్లను దసరాలోగా నియమిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటేనే భయపడే ప్రజలు.. ఇప్పుడు దర్జాగా వస్తున్నారని చెప్పారు. 80 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి పీహెచ్సీలో మూడు నెలలకు సరిపడా ఈ-ఔషధీ మందులను ఉంచుతామని తెలిపారు.
పీహెచ్సీలకు అదనంగా మరిన్ని దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ రైల్వేలైన్కు అయిన ఖర్చులో మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. మెదక్ రైలు నడపడం ద్వారా నష్టం వస్తే 10 ఏండ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుందని కేంద్రానికి రాత పూర్వకంగా హామీ ఇచ్చినట్టు మంత్రి గుర్తుచేశారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంతోపాటు జడ్పీ చైర్మన్ చాంబర్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, కలెక్టర్ ఎస్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.