హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదన వినిపిస్తూ.. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిసరాల్లో కాలుష్య కారక పరిశ్రమలు, హోటళ్లు, కాలనీలను ఏర్పాటు చేయరాదంటూ 1996లో ప్రభుత్వం 111 జీవో ఇచ్చిందని , దీని పరిధిలో 84 గ్రామాలున్నాయని చెప్పారు. ఈ జీవోలోని కొన్ని నిబంధనలను సడలించామని, దీనిపై అధ్యయన కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అధ్యయన నివేదిక నిమిత్తం ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.