హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఆందోళన పెల్లుబుకుతున్న నేపథ్యంలో వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. టెక్స్టైల్స్పై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీని యథాతథంగా కొనసాగిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. మరింత లోతుగా సమీక్ష జరిపేందుకు పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి ఈ అంశాన్ని పంపిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి నాటికి కమిటీ నివేదిక వస్తుందని పేర్కొన్నారు. నిజానికి జనవరి 1 నుంచి వస్త్ర పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 46వ సమావేశంలో జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఈ విషయాన్ని నిర్మ లా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. ఆది నుంచి జీఎస్టీ పెంపుదలను తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టెక్స్టైల్స్పై జీఎస్టీ పెంపుదలను తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ర్టాలే కాకుండా బీజేపీ పాలిత గుజరాత్ కూడా వ్యతిరేకించింది. వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాల వర్తకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వస్త్ర పరిశ్రమ ఆందోళనలకు అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ పెంపుదల వల్ల చేనేత రంగానికి జరిగే నష్టాన్ని వివరిస్తూ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్ర మంత్రులకు వరుసగా ట్వీట్లు చేశారు. వస్ర్తాలపై జీఎస్టీని తగ్గించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి దర్శన జర్దోష్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కూడా డిమాండ్ చేసిన విషయాన్ని నిర్మలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ పెంపుదలపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తే, సాగు చట్టాల విషయంలో రైతులు తిరగబడ్డట్టే నేతన్నలూ తిరగబడతారని హెచ్చరించారు. పన్ను పెంపును విరమించుకొనే వరకు వస్త్ర పరిశ్రమకు, పారిశ్రామికవర్గాలకు, నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కొంత ఊరట నిచ్చింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చేనేతరంగం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారైంది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు తెరలేపుతూ.. మరో వైపు సవతితల్లి ప్రేమను ఒలకబోస్తున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం కేంద్రం బాటలో నడుస్తున్నారు. చేనేత, జౌళి రంగాలను ఆదుకునే ప్రయత్నం చేయకుండా, తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బాధ్యతలను తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం మరీ విడ్డూరం. ఇప్పటికే చేనేత, జౌళి రంగాలను పూర్తిగా దెబ్బతీసేలా కేంద్రం అనేక సంస్థలను, బోర్డులను రద్దు చేసింది. ఆలిండియా హ్యాండ్లూం బోర్డు, ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, ఆలిండియా పవర్లూం బోర్డు, ‘థ్రిఫ్ట్ ఫండ్ కం సేవింగ్స్, సెక్యూరిటీ’ పథకం, కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ సాధారణ బీమా పథకం (ఆరోగ్య బీమా), మహాత్మాగాంధీ బున్కర్ బీమా యోజన (ఎంజీబీబీవై) పథకం, హౌజ్ కం వర్క్షెడ్ తదితర పథకాలను రద్దు చేసి.. టెక్స్టైల్స్ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేసింది. ఫలితంగా చేనేత రంగం అభివృద్ధి, పరిరక్షణకు నిర్ణయాధికార సంస్థ లేకుండా పోవడంతోపాటు, ఉపాధి కరువై కార్మికులు నడిరోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే దీనిపై జీవనోపాధి పొందుతున్న కార్మికులు ఇతరత్రా ఉపాధిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. వీటన్నింటికి తోడుగా జీఎస్టీ ప్రతిపాదన రావడంతో టైక్స్టైల్స్ రంగం తీవ్రంగా వ్యతిరేకించింది.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని వాయిదా వేయడం పట్ల చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.