కరీంనగర్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. డబుల్ ఇండ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి అన్నారు.
కమాన్ పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్.ఎం.డి ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి రిహాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని ఆయన తెలిపారు.
మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్ పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వెంటనే మారాలని ఆయన కోరారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివారు అధైర్య పడవద్దని అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎలక్ట్రిసిటీ డి.ఈ. రాజిరెడ్డి, ఏడి రాజు, ఎం.పి.పి శ్రీలత, కొత్తపెల్లి తహశిల్దార్ శ్రీనివాస్, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, తదితరులు పాల్గొనారు.