గిర్మాజీపేట, మార్చి 10: గరీబోళ్ల గడ్డగా ఉన్న ప్రాంతం కలెక్టరేట్ అడ్డాగా మారనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశీస్సులతో వరంగల్ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనం పేదల నివాసాల మధ్య ఏర్పాటు కానున్నది. ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో ఆజంజాహి మిల్స్ పరిధిలోని 27.08 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మర్యాదపూర్వకంగా హైదరాబాద్లో కలిసి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్,ఎర్రబెల్లి దయాకర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను వరంగల్ జిల్లా ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకొంటారని కొనియాడారు.
జిల్లాల పునర్విభజనతో వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నర్సంపేట రోడ్డులోని లక్ష్మీపురం, ఖిలావరంగల్ రెవెన్యూ శివారులోని ఆజంజాహిమిల్స్ స్థలంలో నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఆజంజాహి మిల్స్ భూముల నుంచి వివాదరహిత 6.16 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడే చేనేతజౌళి శాఖ కార్యాలయం, చేనేత కార్యకలాపాలు, శిక్షణ కేంద్రం, గోదాం సహా సొంతంగా టీఎస్సీవో షోరూం నిర్మాణం, కాకతీయ మెగా టెక్స్టైల్స్, అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్కు కోసం కమిషనర్ విజ్ఞప్తి మేరకు మరో 2.32 ఎకరాలను కేటాయించింది. మొత్తం 9.18 ఎకరాల వివాదరహిత స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూశాఖకు అప్పగించింది. మిల్లు స్థలంలో తమకే ప్లాట్లు కేటాయించాలని ఆజంజాహి మిల్లు మాజీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. మిల్లు మాజీ ఉద్యోగులకు ‘కుడా’ అభివృద్ధి చేసిన స్థలంలో ప్లాట్లను కేటాయించాలని సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. 318 మందికి మడిపల్లి, అనంతసాగర్ వద్ద ‘కుడా’ అభివృద్ధి చేసిన ‘ మా సిటీ’లో ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా సుప్రీం తీర్పుతో లక్ష్మీపురం, ఖిలా వరంగల్ పరిధిలోని మరో 20.32 ఎకరాల భూమి రెవెన్యూశాఖకు బదిలీ కానున్నది. దీంతో కలెక్టరేట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.