మెదక్ : మెదక్కు ర్యాక్ పాయింట్ రావడం పట్ల ఎరువుల కొరత లేదు. గతంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నాం. మెదక్ జిల్లా ధాన్యగార జిల్లాగా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
గురువారం జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ హేమలత అధ్యక్షతన మెదక్ కలెక్టరేట్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్కు ఉన్న సంకల్పంతో రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణలో పండుతున్నాయి.
దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిందన్నారు.వాస్తవాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. విత్తన సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలి.
పామాయిల్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తే రైతుకు డబుల్ ఆదాయం వస్తదని మంత్రి సూచించారు. ఆసరా పెన్షన్ల కు అర్హులైన వారు మిస్సయితే వెంటనే గుర్తించండి. సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఇప్పించే బాధ్యత నాది అని భరోసానిచ్చారు.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. త్వరలోనే మెదక్లో మెడికల్ కాలేజీ,400 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మెదక్ను మెడికల్ హబ్ గా మారుస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.