Bala Krishna | నందమూరి బాలకృష్ణ మరోసారి తన సరళమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక చిత్రం NBK111 షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య, అదే సమయంలో పక్కనే జరుగుతున్న సాయి దుర్గా తేజ్ సినిమా ‘SYG – సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ సెట్ను సందర్శించి చిత్ర బృందాన్ని ఆనందంలో ముంచెత్తారు. ఆయన చేసిన ఈ సర్ప్రైజ్ విజిట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో బాలకృష్ణ నటిస్తున్న NBK111 చిత్రీకరణ కొనసాగుతోంది. అదే ప్రాంగణంలోని మరో ఫ్లోర్లో దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా అక్కడికి వెళ్లి చిత్ర బృందాన్ని కలిశారు.
బాలకృష్ణను అకస్మాత్తుగా తమ సెట్స్లో చూసిన సాయి దుర్గా తేజ్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముందుగా హీరో సాయి దుర్గా తేజ్ను ఆప్యాయంగా పలకరించిన బాలయ్య, అనంతరం దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో కొంతసేపు ముచ్చటించారు. సినిమా కథ, దాని నేపథ్యం, నిర్మాణ విలువలు, చిత్రీకరణ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. చిత్ర బృందం వివరించిన కథ, సినిమా విజన్, భారీ స్థాయిలో రూపొందిస్తున్న సన్నివేశాల గురించి విన్న బాలకృష్ణ ఎంతో మెచ్చుకున్నారని సమాచారం. మంచి కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
చిత్ర బృందం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించిన బాలయ్య, సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.బాలకృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో స్వయంగా సెట్స్కు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం తమకు మరింత బాధ్యతను పెంచిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక బాలకృష్ణ నటిస్తున్న NBK111 చిత్రం కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ కూడా విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రంగా ఇండస్ట్రీలో మంచి బజ్ను సొంతం చేసుకుంది.