హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మెగా డీఎస్సీకి పోటీపడతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) గండం పొంచి ఉంది. డీఎస్సీకి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన వారు ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు టెట్ లేకపోవడంతో డీఎస్సీకి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక గతంలో క్వాలిఫై కాక మరో చాన్స్ కోసం వేచిచూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటులా పరిణమించింది. టెట్ లేకుండా నేరుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్లు డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కనపెట్టి న్యాయం కోసం రోడ్డెక్కావల్సి వస్తున్నది. రేవంత్రెడ్డి సర్కారు అనాలోచిత నిర్ణయంతో వీరంతా రోడ్లమీద మండుటెండల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవలే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ను విడుదల చేసింది సర్కారు. అయితే గతంలో డీఎస్సీకి ముందు టెట్ను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు టెట్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీచేశారు. దీంతో గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసినవారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. ఇటీవలే అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ (డీఎస్ఈ)ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ ఆందోళలను తీవ్రతరం చేశారు.
బీఎడ్ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నవారు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిచ్చారు. డీఎడ్ రెండో సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలనూ పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కానీ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో అర్హత సాధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేనాటికే టెట్లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులో టెట్ మార్కులు అప్లోడ్ చేయాలన్న నిబంధన విధించారు. ఇలా రెండు విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్లో గమనార్హం. ఇంత కన్నా అన్యాయమేముంటుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇక టెట్ పరీక్ష ఎప్పుడూ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నది. ముఖ్యంగా ఎస్ఏ జీవశాస్త్రం, భాషాపండితులు తమకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్ కోసం చదవాల్సిరావడంతో, వాటిపై అవగాహన లేక తీరా పరీక్షల్లో బోల్తా పడి టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. ఇక పేపర్-2లో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క 2022 మినహా ఎప్పుడూ 30 శాతం లోపే అభ్యర్థులే ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది నిర్వహించిన టెట్లో 15 శాతమే ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే టెట్ను మరోసారి నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఎస్జీటీ ఉద్యోగం కోసమనే నేను డీఎడ్ సెకండియర్ చదువుతున్నా. త్వరలో మెగా డీఎస్సీ వేస్తారు.. ఈ సారి టీచర్ ఉద్యోగం కొట్టాలని రాత్రింబవళ్లు ప్రిపరేవుతున్నా. టెట్ నిర్వహించకుండా ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇది ఎంతవరకు న్యాయం. టెట్ లేకపోవడంతో ఇప్పుడు డీఎస్సీకి అవకాశం లేకుండాపోయింది. దీంతో మేం వారం రోజులుగా చదువులు పక్కనపెట్టి రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేస్తారో.. ఇన్నీ ఉద్యోగాలుంటాయో లేదో తెలియదు. కావున ఇప్పుడు టెట్ తర్వాతే డీఎస్సీని నిర్వహించాలి.
– సందేశ్, హైదరాబాద్
గతంలో టెట్ పేపర్లు కఠినంగా ఇచ్చారు. దీంతో చాలా మంది క్వాలిఫై కాలేదు. కొంత మంది క్వాలిఫై అయినా తక్కువ మార్కులే తెచ్చుకున్నారు. డీఎస్సీలో టెట్ వెయిటేజీ అమలుచేస్తున్నారు. ఇలాంటప్పుడు టెట్ స్కోర్ ముఖ్యం. కావున టెట్ను నిర్వహించాల్సిందే. కేసీఆర్ సర్కారు 5 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తే 21 వేల ఖాళీలున్నాయని, ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎసీ అని రేవంత్రెడ్డి మాట్లాడారు. మరిప్పుడు 21 వేలకు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాత వాటికి ఆరు వేల పోస్టులే ఎందుకు కలిపారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను కాంగ్రెస్ నేతలు మభ్యపెట్టారు. ఏజెన్సీ ప్రాంత పోస్టులను గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్ను జారీచేయాలి.
– భుక్యా కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా