హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ‘75 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనను ప్రజలు చూశారు. మాటలు తప్ప మార్పు రాలేదు. దేశానికి కొత్త నాయకత్వం అవసరం. సరైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం తీసుకొన్నారు. 8 ఏండ్లలోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ మాడల్ దేశవ్యాప్తం కావాలి. అది కేసీఆర్ వల్లే సాధ్యం. నాయకుడికి అనుభవంతోపాటు ముందుచూపు కావాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న తపన ఉండాలి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో మార్పు అత్యవసరం. దేశ హితం కోసం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. పార్టీని తెలంగాణ నుంచి దేశస్థాయికి విస్తరిస్తానని సీఎం కేసీఆర్ చెప్తే నేను కూడా ఆహ్వానించి బీఆర్ఎస్లో చేరిన’ అని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవశ్యకత, సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలన, దేశంలో జరుగుతున్న విద్వేష రాజకీయాలపై గమాంగ్ శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్తో మీ అనుబంధం ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉన్నది. ఇద్దరం చాలా ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి కేసీఆర్. రాజకీయాల్లో సీనియార్టీ ఒక్కటే చాలదు. ప్రజా సమస్యల పరిష్కారంపై సిన్సియారిటీ కూడా ప్రధానం. దేశంలో అత్యంత అరుదైన నేతల్లో కేసీఆర్ ఒకరు. ప్రజాబలం ఉన్న నాయకుడు. నేను 9 సార్లు ఎంపీగా,11 ఏండ్లు కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాను. నా రాజకీయ జీవితంలో అనేకమందిని చూశాను.
దేశంలో రాజకీయాలు ఇప్పుడెలా ఉన్నాయి ?
కాంగ్రెస్, బీజేపీల పాలనను 75 ఏండ్లు ప్రజలు చూశారు. ఇన్నేండ్లయినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి కారణం నాయకుల చిత్తశుద్ధి లోపమే. దేశంలో కొత్త పార్టీ ఆవశ్యకత ఉన్నది. భారత రాష్ట్ర సమితి తరహా మరొక పార్టీ ఇప్పటివరకు లేదు. ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన పార్టీలు రావాలి. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కేసీఆర్ సరైన సమయంలో తీసుకొన్న నిర్ణయానికి జాతీయస్థాయిలో ఆమోదం ఉన్నది. కేసీఆర్ తపన చాలా గొప్పది.
ఒడిశాలో ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏమిటి ?
ఒడిశాలో మూడు ‘బీ’ల మధ్యనే పోటీ. బిజు జనతాదళ్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలిస్తున్న బిజు జనతాదళ్తో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. అక్కడ పాలన నిర్వీర్యం అయ్యింది. అనేక వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోవడం లేదు. పాలకులు, అధికారులు తమ విధులను మరచిపోయారు. బీఆర్ఎస్ ఒడిశాలో సేఫ్గా ల్యాండింగ్ అయ్యింది. భౌగోళికంగా, సామాజికంగా బీజేపీకి ఒడిశాలో స్థానం లేదు. బిజు జనతాదళ్ పట్ల ప్రజలు అనుకూలంగా లేరు. ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
అక్కడి ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది ?
ఒడిశాలో నాయకత్వ లేమి కనిపిస్తున్నది. సీఎం నవీన్ పట్నాయక్ను ప్రజలు ఇప్పటికీ బీజు పట్నాయక్ కొడుకుగానే చూస్తున్నారు. ఇంకా ఆయన నాయకుడిగా ఎదగలేదు. అక్కడి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పలాయనవాదాన్ని అనుసరిస్తున్నది. అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదు.
ఇప్పటి రాజకీయాలు ఎలా శాసిస్తున్నాయి ?
దేశంలో ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలి. మిగిలిన రోజులు పాలించాలి. కానీ, నేడు దేశంలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు జరిగే వరకు రాజకీయం తప్ప మరొకటి కనిపించడం లేదు. పాలనపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణలో మాత్రం దీనికి కొంత భిన్నమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ పాలన చక్కగా జరుగుతున్నది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న చోట కూడా అభివృద్ధి ఉన్నది.
దేశంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటి ?
దేశంలో ఒక అద్భుతమైన విషయాన్ని గమనించాను. ఇక్కడ వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు సమాంతరంగా ఎదుగుతున్నాయి. నేను కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ కోసం విపరీతంగా ప్రయత్నం చేశాను. అప్పుడు అనేక చర్యలు తీసుకొన్నాం. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. దీంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నది.