Telangana | బీర్కూర్, మే 15: డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అందుకోసం ఇంటికి నిప్పటించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ-నారాయణ దంపతులకు ఏకైక కుమారుడు అశోక్. నారాయణ గతంలోనే మృతి చెందాడు. అశోక్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. దీంతో తల్లి చంద్రవ్వ ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. ఇంటి పక్కన గల గదులను అద్దెకు ఇచ్చింది. కాగా అశోక్ నిత్యం డబ్బుల కోసం చంద్రవ్వను వేధించేవాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నిన అశోక్ సోమవారం మధాహ్య్ంన బీర్కూర్ చేరుకున్నాడు.
తల్లి ఇంట్లో ఉన్నదని భావించి బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయటి నుంచి రావడాన్ని చూసిన అశోక్ పారిపోయాడు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా అశోక్ తనను విపరీతంగా కొడతాడని, డబ్బుల కోసం వేధిస్తాడని తల్లి చంద్రవ్వ వాపోయింది. ఇంటికి నిప్పంటించడంతో ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు రూ.1.20 లక్షలు, 8 తులాల బంగారం కాలి బూడిదైనట్టు ఆమె వాపోయింది. మూడు నెలల క్రితం కూడా తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని త్రుటిలో తప్పించుకున్నట్టు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు అశోక్ పరారీలో ఉన్నట్టు ఎస్సై బాల్రెడ్డి తెలిపారు.