కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినా నందిగ్రాంలో మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. భవానీపూర్ సిట్టింగ్ టీఎంసీ ఎమ్మెల్యే సొవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా పార్టీ సైతం ఆమోదముద్ర వేసింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు భవానీపూర్ నుంచి గెలుపొందిన మూడు వారాల్లోనే ఆ సీటును తాను ఖాళీ చేస్తానని గతంలో ఛటోపాధ్యాయ సంకేతాలు పంపారు. ఇక బెంగాల్ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన మమతా బెనర్జీ ఆ పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.