హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా పలువురు నెట్జన్లు మద్దతు ప్రకటించారు. మోదీజీ సమాధానం చెప్పాల్సిందేనంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్లో ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్గా మారింది. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఆవిర్భావాన్ని కించపరిచింది మీరే కదా మోదీజీ.. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే’నని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా? లేక తప్పించుకుంటారా? అని టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘తెలంగాణ పథకాలపై ప్రచారానికి ఏర్పాటుచేసిన హోర్డింగ్స్పై బీజేపీ పోస్టర్లు అతికిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క పిలుపు ఇస్తే ఏమి అవుతుందో..? టీఆర్ఎస్ కార్యకర్తలు వీధుల్లోకి వస్తే ఏమి జరుగుతుందో చూడాలనుకొంటున్నారా? మోదీజీ సమధానం చెప్పండి’ అంటూ బీజేపీ పోస్టర్లను అంటిస్తున్న వీడియోను షేర్ చేశారు.
‘మోదీజీ.. బ్లాక్మనీ వెనక్కి తీసుకొచ్చి.. ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేశారా? ఈ ప్రశ్నకు సమాధానం మీ నుంచి వినాలని ఎదురుచూస్తున్నా’మంటూ టీఎస్రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ట్వీట్ చేశారు. ‘2014 ఎన్నికల సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయహోదా ఇస్తామని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. మరి ఎనిమిదేండ్లలో ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని మరో నెట్జన్ ప్రశ్నించారు. ‘రూపాయి విలువ ఎందుకు తగ్గింది? నిత్యావసరాల ధరలు ఎందుకు పెరిగాయి?’ అంటూ పలువురు ప్రశ్నలు సంధించారు. మోదీ మస్ట్ ఆన్సర్ హ్యాష్ట్యాగ్తో తమ ప్రశ్నలను సంధించారు.
ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. ఆర్థిక నేరగాళ్ల వేషాలు ధరించి పలువురు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ‘మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం.. మీరు మొత్తం దేశాన్నే దోచుకొంటున్నారు’ అని రాసిన ప్లకార్డులతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన వ్యక్తంచేశారు. ‘వీ ఓన్లీ రాబ్ బ్యాంక్.. యూ రాబ్ ది హోల్ నేషన్.. బైబై మోదీ” అని రాసి ఉన్న ప్లకార్డులతో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, కాచీగూడ రైల్వేస్టేషన్, బీహెచ్ఈఎల్, జహీరాబాద్ ఎల్ఐసీ ఆఫీస్ దగ్గర నిరసనలు తెలిపారు. పలుచోట్ల భారీ హోర్డింగ్లు ఏర్పాటుచేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఏడాదికి రెండో కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమైంది? ఆన్సర్ చేయండి మోదీ.
– మంత్రి శ్రీనివాస్గౌడ్
మోదీకి సూటి ప్రశ్న.. నిజామాబాద్కు పసుపుబోర్డ్డు ఎందుకు ఇవ్వలేదు? మీ నాయకుడు నిజామాబాద్ ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలిచాడు. ఇది నిజమా? కాదా? చెప్పండి మోదీ.
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి