హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ప్రకటించనున్నాయా? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చనీయాంశం. కంటివెలుగు కార్యక్రమానికి ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో జాతీయ మీడియా చూపు మొత్తం ఇప్పుడు తెలంగాణపై కేంద్రీకృతమైంది. వాస్తవానికి తనకు ఎవరూ ఎదురులేరని విర్రవీగుతున్న ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఝలక్ ఇస్తూ సీఎం కేసీఆర్ ఎదురొడ్డి నిలబడినప్పటినుంచి.. జాతీయ మీడియా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు కేసీఆర్ గురించి చర్చించడం మొదలుపెట్టారు.
టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు సైతం జాతీయ స్థాయిలో కొత్త పార్టీ రాబోతున్నదని పెద్దఎత్తున చర్చ నడిచింది. కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలతో ఆయన భేటీ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఏపీలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేయడంతో పార్టీ విస్తరణపై కథనాలు ఊపందుకున్నాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మొదటినుంచీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు.
గుజరాత్ మాజీ సీఎం శంకర్సింగ్ వాఘేలా, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ వచ్చి సీఎం కేసీఆర్ను కలవడం, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ఠాక్రే కేసీఆర్ చర్చలు జరుపడం వంటి పరిణామాలపై జాతీయ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఓ వైపు రాజకీయంగా విపక్ష పార్టీలను ఏకం చేస్తూ, మరోవైపు తెలంగాణ మాడల్ను దేశానికి పరిచయం చేస్తుండటంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ హాట్టాపిక్గా మారారు. తాజాగా ‘హిందుస్థాన్’ అనే పత్రిక 2024లో విపక్ష పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నదని ఒక కథనాన్ని ప్రచురించింది.
బీజేపీయేతర, కాంగ్రెసేతర విపక్ష నేతలను సీఎం కేసీఆర్ ఏకం చేస్తుండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందుకోసం ప్రాంతీయ పార్టీలను సీఎం కేసీఆర్ కలుపుకొనిపోతున్నారని పేర్కొన్నది. కంటివెలుగు ప్రారంభోత్సవానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) భగవంత్ మాన్ (పంజాబ్), పినరాయి విజయన్ (కేరళ), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వస్తుండటాన్ని గొప్ప వ్యూహంగా ఆ పత్రిక ప్రశంసించింది. కలిసి వచ్చే పార్టీలను ఇలాగే కలుపుకొంటూ వెళ్తూ జాతీయ స్థాయిలో కీలకనేతగా కేసీఆర్ మారుతున్నారని విశ్లేషించింది.
అనేక రాష్ర్టాల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నదని, ముఖ్యంగా కర్ణాటకతో మొదటి అడుగు పడబోతున్నదని తెలిపింది. కర్ణాటకలోని 30కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ తన హవా చూపే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉంటారని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నా.. ఢిల్లీలో ఆయన పరపతి తక్కువేనని స్పష్టంచేసింది. సొంత రాష్ట్రంలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నితీశ్కు జాతీయస్థాయిలో అవకాశాలు తక్కువేనని విశ్లేషించింది.