హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అదే విడ్డూరం.. అదే విధానం..! బడ్జెట్ పేరుతో కేంద్రం రైతులను మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నది. ధాన్యం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తెలంగాణలో యాసంగిలో వరి పండించవద్దని, సాగు చేసినా ధాన్యం కొనుగోలు చేయబోమని భీష్మించిన కేంద్రం.. తాజాగా కేంద్ర బడ్జెట్లో పది కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లోనూ వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని చెప్తున్న కేంద్రం పదికోట్ల టన్నుల ధాన్యాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. యాసంగిలో పండించవద్దన్న కేంద్రం ఒక్క వానకాలం సీజన్లోనే 10 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందా? అంత ఉత్పత్తి దేశంలో వస్తుందా? అధిక ఉత్పత్తి వచ్చిన ఈ ఏడాదే దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ కొనుగోలు చేసిన ధాన్యం సుమారు 6 కోట్ల టన్నులే. ఈ వానకాలంలో తెలంగాణ నుంచి 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికే కేంద్రం ముప్పుతిప్పలు పెట్టింది. తమ వద్ద ఇప్పటికే బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయని, గోదాములు ఖాళీ లేవని సాకులు చెప్పింది. ఈ కారణాలతో ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది. మరి బడ్జెట్లో ప్రకటించినట్లు 10 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? ఎక్కడ నిల్వ చేస్తారో కేంద్రానికే తెలియాలి.
మద్దతు ధరపై ఆర్భాటాలు
పంటలకు మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల తెలిపారు. కేంద్రం కొనుగోలు చేస్తున్నది కేవలం వరి, గోధుమలే. వీటిని కూడా మొత్తం కొనుగోలు చేయడం లేదు. అలాంటప్పుడు మద్దతు ధర కోసం కేటాయించిన రూ. రెండు లక్షల కోట్లతో ఎవరికి లాభం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పంటలే కొనుగోలు చేయనప్పుడు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడితే లాభమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. పంటలకు మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలన్న రైతుల డిమాండ్ను కేంద్రం పట్టించుకోలేదు.
కేంద్ర బడ్జెట్ నిరర్ధక, నిష్ప్రయోజనకరమైనది. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయహోదా ఇవ్వలేదు. కాజీపేట కోచ్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ హామీలు నెరవేర్చలేదు.
-పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
60 ఏండ్లు నిండిన రైతులకు పెన్షన్ స్కీం తెస్తామన్న బీజేపీ మ్యానిఫెస్టోలోని హామీ ని ఈ బడ్జెట్లో కూడా నెరవేర్చలేదు. ఉద్యానపంటలు, ఆయిల్పామ్, నూనె గింజలు, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం కరువైంది.
-వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
కేంద్ర బడ్జెట్ బడుగు, బలహీనవర్గాలకు నిరాశే మిగిల్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర విభజన హామీల్లోని ఐఐఎం ప్రస్తావన లేదు. జిల్లాకొక నవోదయ పాఠశాల మంజూరును పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ల పట్ల కనీస స్పందన లేదు.
-ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
బడ్జెట్తో ప్రజలకు పైసా ఉపయోగం లేదు. తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు. బీజేపీ రాష్ట్ర నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిజామాబాద్కు పసుపు బోర్డు ప్రస్తావన లేదు. ప్రజల పాలిట మోదీ ‘సబ్ కా వినాష్’ అనడానికి బడ్జెట్ కేటాయింపులు నిదర్శనం.
-రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు దశ, దిశ లేదు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అన్నీ అసత్యాలు, అంకెల గారడీలు తప్ప ఏ వర్గానికీ మేలు జరిగేలా కేటాయింపులు చేయలేదు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది. ఏ ఒక వర్గానికీ లాభం చేకూర్చలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలతోపాటు ఉద్యోగ, కార్మికవర్గాలకు మొండిచేయి చూపించారు.
కేంద్ర బడ్జెట్ బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించింది. తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీల సంక్షేమానికి కనీస నిధులు కేటాయించలేదు.
ప్రజాసంక్షేమాన్ని పణంగా పెట్టింది. తెలంగాణకు ద్రోహం తలపెట్టింది. పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు.
ప్రజావ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతాం.
కొవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైంది. రైతు ఆదాయం రెట్టింపు, ఇండ్ల హామీలకు గతిలేదు.
-చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కేంద్రానిది నిరాశజనక బడ్జెట్. ఏడేండ్లుగా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. 12 నెలల జీతాల వస్తుంటే.. రెండు నెలల జీతాన్ని కేంద్రం పన్నురూపంలో తన్నుకుపోవడం దారుణం.