హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను, తీర్పులను అమలు చేయలేదని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు విధించడంపై పర్యావరణవేత్తలు, తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివరించిన అంశాల్లో దేనినీ పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్జీటీ గుడ్డిగా ఈ తీర్పు ఇచ్చిందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమర్థంగా పనిచేసే ప్రభుత్వాలు నిరుత్సాహానికి గురై నిస్తేజం ఆవహిస్తుందని పేర్కొంటున్నారు.
అన్ని రాష్ర్టాలను ఒకే గాటన కడుతున్న ఎన్జీటీ.. క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించకుండా తెలంగాణపై బురద చల్లేలా తీర్పు ఇచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటిది కాదు. దాదాపు 26 ఏండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితుల ఆధారంగా సుప్రీంకోర్టులో వేసిన ఈ కేసు 2014లో ఎన్జీటీకి బదిలీ అయింది. ఇంతలో తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడటంతో పరిస్థితుల్లో సమూలంగా మార్పులు వచ్చాయి.
ఈ కేసులో గత నెల 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుది వాదనలు జరిగాయి. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు, వాటి పురోగతిని అధికారులు ఆ వాదనల సమయంలోనే వివరించారు. అవసరమైతే ఎన్జీటీ బృందమే క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నవించారు. కానీ, వీటిలో ఏ అంశాన్నీ ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని తెలంగాణవాదులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘వేస్ట్ టూ ఎనర్జీ’ విధానాన్ని అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలను కూడా కొనుగోలు చేసింది. ద్రవ వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇప్పటికే 40% ద్రవ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దీన్ని 100 శాతానికి పెంచేందుకు రూ.3,864 కోట్లతో ప్రత్యేకంగా 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ పనులు ఎంతో చురుకుగా సాగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఎన్జీటీకి సీఎస్ వివరించినప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై తెలంగాణవాదులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014కు ముందున్న పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఎన్జీటీ ఈ తీర్పు ఇచ్చినట్టు భావిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.