హాజరు తప్పనిసరికాదు
హైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాలు, వసతిగృహాలను మినహాయించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బుధవారం నుంచి ప్రారంభిస్తు న్నాం. పాఠశాలకు విద్యార్థుల హాజరు తప్పనిసరికాదు. స్కూలుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. విద్యార్థుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలు తీసుకోవద్దు. ఇప్పటికే జారీచేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పాఠశాలల నిర్వహణ సాఫీ గా సాగేలా చర్యలు తీసుకోవాలి.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఎవరూ ఆందోళచెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడికొచ్చిన పిల్లలందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. బుధవారం నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష, ఆన్లైన్ తరగతులు సమాంతరంగా నిర్వహిస్తామని చెప్పారు. కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులే ఉంటాయని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. వివరాలు ఆమె మాటల్లోనే..
వైద్యారోగ్యశాఖ సూచనలతోనే ప్రారంభం
రాష్ట్రంలో విద్యాసంస్థలు తప్ప అన్ని కార్యకలాపాలు యథావిధిగా నడుస్తున్నాయి. ఎవరి పనులు, ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటున్నారు. విద్యార్థులు మాత్రమే నష్టపోతున్నారు. తరగతులు ప్రారంభమైతే ఎలా అన్న ఆందోళనవద్దు. టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. విద్యార్థులను బడులకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు సైతం వ్యాక్సిన్ వేయింకునేలా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. ఆగస్టు నుంచే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని అనుకున్నా.. పరిస్థితులు బాగాలేవన్న వైద్యారోగ్యశాఖ నివేదిక మేరకు నెలరోజులు ఆగాం. ఆ శాఖ సూచన మేరకే ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నాం.
పిల్లల భవిత కోసం
16 మాసాలుగా విద్యాసంస్థలు మూతపడి పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఇం ట్లోనే ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. విద్యారంగాన్ని గాడినపెట్టేందుకే విద్యాసంస్థలు తెరుస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు స్కూళ్లలో ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా తరగతులకు హాజరుకావొచ్చు.
ఆరోగ్యం, చదువు రెండూ ముఖ్యమే
కరోనా నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిం చాం. వాటితో లాభం అంతంతేనని తేలింది. ఆన్లైన్ క్లాసులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాబోవని నిపుణులు సైతం అంటున్నారు. పిల్లలు ఆన్లైన్ తరగతులకు బదులుగా వీడియోగేమ్స్ వంటి వ్యసనాల బాటపడుతున్నారు. పిల్లల ఆరోగ్యం, చదువు రెండూ ముఖ్యమే.
సంఖ్య అధికంగా ఉంటే షిఫ్ట్లు
ప్రత్యక్ష బోధనలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లను షిఫ్ట్ పద్ధతిలో లేదంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నాం. ఇందుకు స్కూళ్లవారీగా కస్టమైజ్డ్ ప్లాన్ను రూపొందించి అమలు చేయనున్నాం. పరిశుభ్రత, శానిటైజేషన్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బడికొచ్చే ఒక్కో విద్యార్థికి గ్రామపంచాయతీల ద్వారా తలా మూడు మాస్కులు ఉచితంగా ఇవ్వనున్నాం.
ప్రైవేటు స్కూళ్లు మానవత్వంతో వ్యవహరించాలి
ప్రైవేటు స్కూళ్లు ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచరాదు. జీవో -75 ప్రకారం ట్యూషన్ ఫీజులే తీసుకోవాలి. అదీ నెలనెలా మాత్రమే వసూలు చేయాలి. కరోనాతో ఇబ్బందులు పడుతున్న 2 లక్షల పైచిలుకు ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకున్నది. స్కూళ్లు సైతం బాధ్యతగా మానవత్వంతో వ్యవహరించాలి.
స్కూలు పిల్లల గురించే..
ఇంటర్, డిగ్రీ వృత్తివిద్యాకోర్సుల విద్యార్థులు 18 ఏండ్ల పైబడినవారే. పాఠ్యాంశాలను వారు అర్థం చేసుకోగలరు. పుస్తకాలు చదువుకోగలరు. మా ఆందోళనంతా స్కూళ్లలోని 60 లక్షల మంది పిల్లల గురించే. వీరు టీచర్లు చెబితే గానీ అర్థం చేసుకోరు. పిల్లలు నష్టపోవద్దన్న ఆలోచనతోనే కేజీ టు పీజీ వరకు తరగతుల ప్రారంభానికి అనుమతినిచ్చాం.