హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత తొమ్మిదేండ్లలో అనేక దిగ్గజ బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలను ఏర్పాటుచేశాయని చెప్పారు. తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణకు రూ.2,64,956 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా 17.77 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్కు తోడు 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థ పాలన వంటివి రాష్ట్రంలో పరిశ్రమలకు వరంగా మారాయని పేర్కొన్నారు. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు చేపట్టిన చర్యలను సీఎం వివరించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ వార్షిక ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు. ఇప్పుడు రూ.1,83,569 కోట్లకు పెరిగింది. 220 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. నాడు 3,23,396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు 8,27,124కు పెరిగారు. ఐటీని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ టవర్లను నిర్మించాం. ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ.1,400 కోట్ల ప్రోత్సాహకం అందించాం. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి ఖాయిలా పడిన యూనిట్లను పునరుద్ధరించాం. వినూత్న ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ , రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. 2022లో భారత ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ స్టార్టప్ అవార్డుల్లో మన టీ-హబ్ ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. స్వరాష్ట్రంలో మండల, జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, రాష్ట్ర రాజధానికి ఫోర్లేన్ రోడ్లు వేసుకున్నాం. జాతీయ రహదారుల నిడివి రెట్టింపైంది. మొత్తంగా రాష్ట్రంలోని రహదారుల నెట్వర్క్ 1.09 లక్షల కిలోమీటర్లకు పెరిగింది.
హైదరాబాద్ నడిబొడ్డున నూతనంగా వెలసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ సౌధం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. అధునాతన హంగులతో అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా సుందరంగా అలరారే నూతన సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం పోరాడి తెలంగాణ సాధించుకోగలిగాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతోపాటు, సచివాలయం సమీపంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోపక్క అమరవీరుల స్మారకం నిర్మించాం. సచివాలయం ఎదురుగా ఉన్న విశాల స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాం.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయటం కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాం. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లతో టౌన్షిప్ నిర్మించాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం నిరంతర ప్రక్రియ. పేదలు తమ సొంత జాగాలో ఇల్లు నిర్మించుకొనేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు చొప్పున ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి అందజేస్తాం.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ర్టానికి పెట్టుబడులు వస్తున్నాయంటే అంతర్జాతీయ ప్రమాణాలతో అమలవుతున్న శాంతి భద్రతల నిర్వహణే కారణం. నేడు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో, అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసుకొన్నాం. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టంచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే రికార్డు.
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీకైన యాదగిరి దేవాలయాన్ని సప్తతల గోపురాలతో, కృష్ణశిల శిల్పాలతో భూలోక వైకుంఠంగా, అడుగడుగునా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ప్రభుత్వం పునర్నిర్మించింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేసుకొన్నాం. దేశంలోకెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివద్ధి కోసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించుకొన్నాం. భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయాన్ని కూడా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి కాశీకి వెళ్లే భక్తుల కోసం 60 వేల చదరపు అడుగుల్లో ఓ వసతి గృహం నిర్మించబోతున్నాం. శబరిమలలోనూ వసతి గృహం నిర్మిస్తున్నాం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్లో ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.