కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో దళితబం ధు పథకం దోహదపడుతుందని చెప్పారు. ఇది పేదదళిత జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమమని, సర్వేను అధికారులు ఇష్టంతో చేయాలని కోరారు. దళితుల ఇంటికి వెళ్లి ఓపికతో, ప్రేమతో వివరాలు సేకరించాలని సూచించారు.
వివాహమైతే వేరు కుటుంబమే..
ఒక ఉమ్మడి కుటుంబం అయినా ఇద్దరు కొడుకులు వివాహాలు చేసుకొని వేర్వేరుగా ఉంటే మూడు కుటుంబాలుగా నమోదు చేసుకోవాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి దళితబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని, మరో 500 కోట్లు మూడు రోజుల్లో మంజూరుచేస్తామని వెల్లడించారు. మొత్తం రూ.2 వేల కోట్లతో నియోజకవర్గంలోని 21 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయని స్పష్టంచేశారు. లబ్ధిదారుల అభిరుచి, నైపుణ్యతకు అనుగుణంగా ఏ యూనిట్ ఎంచుకుంటారో తెలుసుకోవాలని, అవసరమైతే యూనిట్ల ఎంపికకు అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
దళితబంధుతో జీవన ప్రమాణాలు మెరుగు: మంత్రి కొప్పుల
దేశంలో ఎకడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతా యని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు సర్వే ఈ నెల 27 తేదీ నుంచి ప్రారంభించి, వారం రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేతో పాటు దళిత కుటుంబాలందరికీ బ్యాంకర్లు, తెలంగాణ దళితబంధు ఖాతాను తెరవాలన్నారు. పేద, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం దేశానికే గర్వకారణమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్తోపాటు అధికారులు పాల్గొన్నారు.