హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తాను చివరివరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో నే కొనసాగుతానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో పద్మారావు భేటీ అయ్యారు.
ఈ భేటీలో తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. బుధవారం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నట్టు కేటీఆర్కు పద్మారావు తెలిపినట్టు తెలిసింది. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్కు వివరించినట్టు సమాచారం. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశానని, ఉద్యమం కాలం నుంచి కేసీఆర్తోనే ఉన్నానని, ఇక ముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఉంటానని స్పష్టంచేసినట్టు తెలిసింది.