హైదరాబాద్ : తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, రేపు తాను ఎవరిని కలవడం లేదని కేటీఆర్ తెలిపారు. తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం చేస్తూ.. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్కు వస్తున్నాయని వాటన్నింటిని తమ కార్యాలయం క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని అని తెలిపింది.