CPM | హైదరాబాద్ : వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టును నిర్మించాలని కోరింది. శుక్రవారం ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పశు సంవర్ధక, ఉద్యాన, పట్టుపరిశ్రమ తదితర రంగాలపై పరిశోధనలతో పాటు, బయో డైవర్సిటీ ప్లాంటేషన్ కొనసాగుతున్నదని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఈ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టు నిర్మాణం కోసం తీసుకోవడం సరైందికాదని సూచించింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించిన భూములు కూడా ఇతర సంస్థలకు కేటాయించడంతో లక్ష్యం దెబ్బతిన్నదని, దీనివల్ల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. హైదరాబాద్ చుట్టూ పక్కల వివిధ రకాల ప్రభుత్వ భూములున్నాయని, వీటిని కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి హైకోర్టుకు అవసరమైన భూమిని హైదరాబాద్ చుట్టూ పక్కల కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.