నాగర్కర్నూల్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని పార్టీలు, నాయకులు విమర్శలు చేస్తే కర్రు కాల్చి వాతపెడతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. పంటల ఉత్పత్తి, కొనుగోళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో శనివారం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను మూడేండ్లలో పూర్తి చేస్తామన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మూడు దశాబ్దాలు పడితే.. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని చెప్పారు. దీని తొలి దశలోనే 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పష్టంచేశారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.70 వేల కోట్లు ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లది నోరేనా? అని ప్రశ్నించారు. వ్యవసాయంతో 60 శాతం మందికి లబ్ధి కలుగుతుంటే.. అనుబంధంగా గొర్రెలు, చేపల పెంపకం వంటి కుల, చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబట్టడం హేయమన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం ఆంధ్రాను మించిపోయిందని, దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోళ్లు చేయమని చెబుతుందని.. అందుకే రైతులు సన్న బియ్యం పండించాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ పీ రాములు, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.