రూ.1400 కోట్ల కేంద్ర నిధులు రెండు నెలలుగా పెండింగ్
పంచాయతీలకు రాష్ట్రం రూపాయి కూడా బకాయి లేదు
పనిగట్టుకుని అసత్య ప్రచారం
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతం చేయాలి: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన రూ.1400 కోట్ల నిధులు రెండు నెలలుగా పెండింగులో ఉన్నాయన్నారు. విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 17 వరకు రెండువారాలపాటు జరుగనున్న ఐదోవిడుత పల్లెప్రగతి-పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ గురువారం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందుతున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామాల్లో అద్భుతమైన మార్పు, అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నదని, సెప్టెంబర్ 2019 నుండి ఇప్పటివరకు రూ.9,566 కోట్లు స్థానిక సంస్థలకు విడుదలచేశామని వివరించారు. ఈ నెల విడుదల కావాల్సిన రూ.256 కోట్లు కూడా విడుదల చేశామన్నారు. మండల పరిషత్లకు రూ.38.79 కోట్లు, జిల్లా పరిషత్లకు రూ.33.67 కోట్లు విడుదలచేశామని చెప్పారు. మిగిలిన పెండింగ్ చెకులు వెంటనే క్లియర్ చేయడానికి ఫైనాన్స్ డిపార్టుమెంట్ను ఆదేశించినట్లు చెప్పారు.
కావాలనే దుష్ప్రచారం..
రాష్ట్ర ప్రభుత్వం ఠంఛనుగా స్థానిక సంస్థలకు నిధులు అందిస్తున్నదని, రూ.256 కోట్ల నిధులను ప్రతినెలా పంచాయతీలకు విడుదల చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్లు పంచాయతీలకు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలతోపాటు కొన్ని పత్రికలు సైతం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని, ఇటీవల కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సర్పంచ్ వ్యవహారంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదలచేసినా రాలేవంటూ అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఎరుగండ్లపల్లి, వికారాబాద్ జిల్లా బీరోల్ పంచాయతీల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఒక రూపాయి కూడా పెండింగ్ లేదని, జీపీలకు ఇవ్వాల్సిన రూ.1,400 కోట్లను కేంద్రమే పెండింగ్లో పెట్టి రెండు నెలలుగా విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఈ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నిలదీయాలని, పార్లమెంటు సభ్యుడైనప్పటికీ ఉపాధి హామీ పథకంపై ఆయనకు అవగాహన లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన రూ.1,400 కోట్ల బకాయి వచ్చేవరకు కేంద్రాన్ని వెంటాడుతామని కేటీఆర్ స్పష్టంచేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వచ్చే సోమవారం ఢిల్లీ వెళ్లాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు.
ఉపాధిహామీ కింద అభివృద్ధి పనులు
ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా గ్రామాల్లో రూ.900 కోట్లకు పైగా సీసీ రోడ్లను నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి 2 నెలల నుండి మాత్రమే నిధులు పెండింగ్లో ఉన్నాయని, ఇందులోనూ గత బుధవారం రూ.166 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం సాఫ్ట్వేర్ సమస్యలంటూ సాకులు చెప్తున్నదని విమర్శించారు.
సమన్వయంతో పనిచేయండి..
పల్లెప్రగతి, పట్టణప్రగతి లక్ష్యాలను సాధిస్తూ దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా కేంద్రప్రభుత్వం నుంచీ అవార్డులు అందుకుంటున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కేటీఆర్ అన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని, ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు లీడ్ తీసుకొని జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయపర్చుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు.
పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి: మంత్రి దయాకర్రావు
శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని చెప్పారు. బకాయిలపై విపక్షాలు, పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టడంలో సర్పంచులు చొరవ తీసుకోవాలన్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పల్లెప్రగతి కార్యక్రమం సందర్భంగా హైలైట్ చేయాలని ఆయన కోరారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.