మేడ్చల్, మార్చి14 (నమస్తే తెలంగాణ): వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వ్యాపార సంబంధమైన విషయాలపై చర్చించేందుకు మధ్యవర్తి తనను బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్దకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, పార్టీ మారే అలోచనే లేదని తేల్చిచెప్పారు. ఐదేండ్లు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మల్లారెడ్డి స్పష్టంచేశారు. మాజీ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరుతున్నారన్న వార్తలకు తెరపడినట్టయింది.