మానవపాడు, ఆగస్టు 25 : కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన జయరాముడుకు శాంతినగర్కు చెందిన భారతికి 15 ఏండ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
వీరు హైదరాబాద్లో చదువుకొంటున్నారు. కొంతకాలం సాఫీగా సాగిన వారి జీవితంలో ఆ తరువాత గొడవలు మొదలయ్యాయి. ఈ మధ్య గొడవలు అధికమయ్యాయి. దీంతో ఈనెల 22న అర్ధరాత్రి భర్త జయరాముడు నిద్రిస్తున్న సమయంలో మంచానికి కట్టేసింది. అనంతరం అతడి నోట్లో సిరంజితో పురుగుల మందు వేసి పరారైంది. ఆ సమయంలో గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తి భారతికి సహకరించినట్టు జయరాముడు తండ్రి మద్దిలేటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.