హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులోని వ్యక్తిదేనని పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధురవాడకు చెందిన మృదుల, మురళి దంపతులు.
సౌతాఫ్రికాలో ప్రొఫెసర్గా పనిచేసే మురళి ఈ నెల 9న విశాఖకు వచ్చాడు. ప్రియుడి మోజులో పడ్డ మృదుల తన ప్రియుడితో కలిసి పదిరోజుల క్రితం భర్త మురళిని హత్య చేసింది. తర్వాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృదుల, ఆమె ప్రియుడు శంకర్ కలిసి మురళిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. వీరి సమాచారం మేరకు మారికవలస రైల్వే బ్రిడ్జికింద కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. దీంతో మృదుల, ఆమె ప్రియుడు శంకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.