హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మంగళవారం గోషామహల్లో నిర్వహించిన విజయ సంకల్ప రథయాత్రకూ ఆయన హాజరుకాలేదు. ఈ విషయంలో ఆ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. వాస్తవానికి యాత్రకు మొదటి నుంచీ రాజాసింగ్ దూరంగానే ఉంటున్నారు.
ఇప్పుడు ఏకంగా కిషన్రెడ్డి ర్యాలీకి డుమ్మా కొట్టడంతో రాష్ట్ర నాయకత్వానికి, రాజాసింగ్కు మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినప్పటి నుంచే మనస్థాపం చెందినట్టు చెప్తున్నారు. వరుసగా మూడోసారీ ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్రెడ్డిని నియమించడం, ఎల్పీలో ఎలాంటి పదవీ అప్పగించకపోవడంతో తీవ్రంగా మనస్థాపం చెందినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీ టికెట్ అడిగితే పార్టీ ససేమిరా అనడంతో కూడా ఆయన అలిగినట్టు చెప్తున్నారు. దీంతో ఆ పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరం అయ్యారు.