High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశం, బదిలీకి సంబంధించిన సర్టిఫికెట్లలో వారి కులాలు, మతాల ప్రస్తావన లేకుండా చూడాలన్న విజ్ఞప్తిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల అడ్మిషన్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లలో తల్లిదండ్రుల కులం, మతం వివరాలను పొందుపర్చాలన్న నిబంధనను సవాలు చేస్తూ 2017లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలన్న మధ్యంతర పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినట్టు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్వా కుమార్ తెలిపారు.